మలిదశ ఉద్యమకారులకు వెల్ఫేర్ బోర్డు ప్రకటన హర్షణీయం – జేఏసీ నేతలు

లోకవాణి, అచ్చంపేట : మలిదశ తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ అసోసియేషన్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించడం పట్ల జేఏసీ నాయకులు అచ్చంపేట పట్టణ కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద సమావేశామై హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన అసెంబ్లీ తీర్మానంలో ఉద్యమకారులను ఆదుకునే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలపై చర్చ జరిపినట్లు వెల్లడించడాన్ని స్వాగతించారు. ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నెలకు 25 వేల రూపాయల పింఛన్, ప్రత్యేక గుర్తింపు కార్డు వంటి అంశాలపై సానుకూలంగా చర్చ జరుగుతుందని ప్రకటించడం ఆనందకరమని తెలిపారు. గత పదేళ్లుగా ఉద్యమకారులు నిర్లక్ష్యానికి గురై గుర్తింపు లేక ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ప్రభుత్వ స్థాయిలో వారికి సముచిత గుర్తింపు లభించడం సంతోషకరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలకంగా పనిచేసిన మలిదశ ఉద్యమకారుల సేవలను గుర్తించి, వారి సంక్షేమానికి చర్యలు చేపట్టడం చారిత్రాత్మక నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారులను గుర్తించి వారి భవిష్యత్తు భద్రతకు భరోసా ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయాలు కేవలం హామీలకే పరిమితం కాకుండా, త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శ్రీనివాస్, మహబూబ్ అలీ, పదర రమేష్, గిరిబాబు పాల్గొని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. మలిదశ ఉద్యమకారుల సంక్షేమానికి ఈ నిర్ణయం మైలురాయిగా నిలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

WhatsApp Join Now
Youtube Subscribe